తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన బీసీ మహాసభకు నగర పోలీసులు అనుమతి ఇచ్చారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈ సభను నిర్వహిస్తున్నామని, అనుమతివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.
కవిత విజ్ఞప్తికి పోలీసులు సానుకూలంగా స్పందించి రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. అనుమతి లభించడంతో బీసీ మహాసభ కోసం తెలంగాణ జాగృతి తుది ఏర్పాట్లు పూర్తి చేసింది.
అయితే, అనుమతి కోసం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచే ప్రయత్నాలు జరిపాయి. అనుమతి రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కవిత నేరుగా నగర సీపీకి ఫోన్ చేసి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జరిపే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని కోరారు. పోలీసుల అనుమతితో సభకు ఏర్పాట్లు దూకుడుగా కొనసాగుతున్నాయి.